Thursday 2 June 2016

650 గ్రాముల బరువుతో పుట్టిన పసికందు.......

నెలలు నిండకముందే అతితక్కువ బరువు (650 గ్రాములు)తో పుట్టిన చిన్నారిని నల్గొండ ప్రభుత్వాస్పత్రి వైద్యులు కాపాడి రికార్డు సృష్టించారు.  సాధారణంగా పిల్లలు పుట్టేటప్పుడు సరాసరిగా రెండున్నర కిలోలపైనే ఉంటారు. కానీ నల్గొండ జిల్లాలో ఓ తల్లి నెలలు నిండకముందే ఓ పాపకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డ ప్రాణాలతోనే ఉంది. పాప  
బతుకుందని ఎవ్వరూ ఊహించలేదు. పాపతల్లి ఆరు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు హైబీపీకి లోనైంది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. తప్పని పరిస్థితుల్లో ఆపరేషన్ చేసిన వైద్యులు ఆడశిశువును భూమిమీదకు తీసుకువచ్చారు. 650 గ్రాముల బరువుతో పుట్టిన చిన్నారిని కాపాడటం తమ వల్ల కాదంటూ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు చేతులెత్తేశారు. 
 
దీంతో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లే స్తోమత లేక చిన్నారి తల్లిదండ్రులు పాపను ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. పాప తల్లిదండ్రులు మమత, శంకర్‌ది నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పేరికకొండారం గ్రామం. చిన్నారి మీద ఆశలు వదులుకుని తమ బిడ్డను బతికించినా మీరే చంపినా మీరేనంటూ గవర్నమెంట్ ఆస్పత్రిలోనే వదిలేశారు. నల్గొండ ప్రభుత్వాస్పత్రి వైద్యులు అందించిన చికిత్సకి పాప స్పందించడం మొదలుపెట్టింది.
 
డాక్టర్ దామర యాదయ్య మాట్లాడుతూ.... ఆసుపత్రిలో ఎప్పుడూ దాదాపు 26 మంది బిడ్డలు దాకా ఉంటూనే ఉంటారని, వారి కోసం నలుగురు నర్సులు మాత్రమే ఉండగా, ఓ నర్సుని మాత్రం ఎప్పుడూ రిషిత వద్దే ఉంచేవాడినని, ఇప్పుడు పాప పుట్టి ఐదు నెలలు గడిచాయని, ఆమె ఎదుగుదల సాధారణంగా ఉందని, వినికిడి శక్తి, చూపు బాగున్నాయని, ఎవరైనా పలకరిస్తే, నవ్వుతుందని తెలిపారు. 
 
పాపను బతికించడానికి నర్సులు ఎంతో  కష్టపడి చిన్నారికి మొదటి నెలరోజుల పాటు పోతపాలు పట్టారు. కొంతమంది బాలింతల సహాయం కూడా తీసుకున్నారు. వారి పాలను పట్టారు. రుషిత శ్వాసకు ఇబ్బంది రాకుండా ఇంజెక్షన్లు చేశారు. నెలరోజుల తర్వాత పాప తల్లి మమత పాలను చిన్నారికి అలవాటు చేశారు. పాపకు శబ్దాలను వినిపించి వినికిడి శక్తిని కలిగించారు. పాపను బతికించిన వైద్యులు రుషితను ఆమె తల్లి మమతతో పాటు ఇంటికి పంపారు. లేదనుకున్న తన కూతురిని తిరిగి బతికించినందుకు వైద్యులకు ధన్యవాదాలు చెబుతోంది మమత.

No comments:

Post a Comment