Friday 8 July 2016

ఆధార్ కార్డ్ ఉంటేనే రైలు ప్రయాణం

మీకు ఆధార్ కార్డు లేదా..అయితే ఇకపై మీరు రైలు ప్రయాణం చేయలేరు. మీరు రైలు ప్రయాణం చేయాలంటే ఇప్పుడు తప్పనిసరిగా ఆధార్ కార్డును తీసుకోవాల్సిందే..ఎందుకంటే రైల్వేశాఖ ఆ దిశగా కసరత్తులు చేస్తోంది. రైల్వే టికెట్‌కు ఆధార్‌ కార్డును అనుసంధానం చేయాలని కేంద్రం భావిస్తోంది. దానికి అవసరమైన చర్యలను వేగవంతం చేసింది. 15 రోజుల్లో ముసాయిదా విధానం ఖరారు కానుంది. ఈ ప్రాజెక్ట్ ను రెండు దశల్లో అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది


అసలైన ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేలా వారికి మాత్రమే సబ్సిడీలు ,రాయితీలను అందించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. రాయితీలు,సబ్సిడీలు దుర్వినియోగం కాకుండా కోత వేస్తోంది. 
తొలిదశలో రాయితీలు గల టికెట్లకు ఈ ప్రయోగాన్ని అమలు చేయనున్నారు. వయోవృద్ధులు, స్వాతంత్య్ర సమరయోధులు, వికలాంగులు, విద్యార్థులు, నిరుద్యోగుల కోటా కింద ఇచ్చే రాయితీ టికెట్లకు ఆధార్‌ వివరాలు తప్పనిసరి చేస్తారు.
ఇక రెండోదశలో ముందుగా రిజర్వేషన్‌ టికెట్లపై ప్రయోగించనున్నారు. తర్వాత సాధారణ జనరల్‌ టికెట్లకూ అమలు చేయనున్నారు. మొదటిదశ అమలు చేసిన రెండునెలల తర్వాత రెండోదశను అమలు చేయాలని రైల్వేశాఖ యోచిస్తోంది.

మీరు ఆన్‌లైన్లో టికెట్ బుక్‌చేసేటప్పుడు లేదా రైల్వే కౌంటర్లో కొనేటప్పుడు వారికి మీ ఆధార్‌కార్డు నెంబరు ఇకపై తప్పక ఇవ్వాల్సి ఉంటుంది.
నిజమైన ప్రయాణికులు మాత్రమే ప్రయాణించాలన్న ఉద్దేశంతో ఈవిధానాన్ని రూపొందిస్తున్నామని రైల్వేవర్గాలు చెబుతున్నాయి. దేశంలో మెజారిటీ ప్రజలు ఆధార్‌ కార్డులు తీసుకున్నారు కాబట్టి దీనివల్ల ఇబ్బంది ఎదురుకాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఈ ప్రయోగంలో ప్రణాళిక ప్రకారం ఆధార్‌ కార్డు నెంబరును టికెట్‌పై ముద్రిస్తారు. తర్వాత ఆ నెంబర్‌ను టికెట్‌ ఎగ్జామినర్‌ వద్దనున్న ప్రత్యేక మొబైల్‌కు పంపిస్తారు. దాంతో ప్రయాణ సమయంలో టీసీ ఆ ప్రయాణికుని దగ్గరకు తనిఖీ కోసం వెళ్లి ఆధార్‌ కార్డు వివరాలు పరిశీలిస్తారు.

ఇప్పుడు ఒక ప్రయాణికునికి రైల్వేశాఖ 43 శాతం దాకా సబ్జిడీ అందిస్తోంది. అంటే ప్రయాణికునికి రైల్వేశాఖ నుంచి అయ్యే ఖర్చు 100 అయితే అందులో రూ. 57 రూపాయలు మాత్రమే రైల్వే శాఖకు చేరుతోంది.

ఈ ఖర్చును సాధ్యమైనంతగా తగ్గించాలని రైల్వేశాఖ ఎప్పటినుంచో కసరత్తులు చేస్తోంది. అందులో భాగంగానే ఆధార్ ను తప్పనిసరి చేయాలనే ప్లానింగ్ చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ప్రయాణానికి అయ్యే ఖర్చు వివరాలను రాయితీ టికెట్లపై ముద్రిస్తున్నారు

ఈ ప్రయోగంతో ఒకరి టికెట్‌పై మరొకరు ప్రయాణించడాన్ని ఇకపై నివారిస్తామని రైల్వేశాఖ చెబుతోంది. అయితే, ఈ విధానాన్ని రూపొందించే ముందు రైల్వేలో న్యాయపరమైన చర్చలు జరిగాయని తెలిసింది.

పీడీఎస్‌, ఎల్పీజీ కనెక్షన్లకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు ప్రకటించిన నేపథ్యంలో ఆధార్‌లంకెపై తర్జనభర్జనలు జరిగాయి. అయితే ఆధార్‌ అనుసంధానం కేసు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు ఇంకా పెండింగ్‌లో ఉంది.

మరి ఇది ముందు ముందు రైల్వేశాఖ నుంచి అమలవుతుందా.. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచిచూడాల్సిందే మరి.

No comments:

Post a Comment